Saturday, October 8, 2011

వేదములు - కొన్ని విషయాలు




         హిందూ పవిత్ర గ్రంథాలలో వేదములు ప్రముఖమైనవి. వీటినే "శ్రుతులు", "ప్రభు సంహితలు"అనికూడా అంటారు. శ్రుతి అనగా విన్నది అని అర్థం. ఇవి భగవంతుని ద్వారా తెలియ చేయబడినవి అని హిందువుల నమ్మకం. వేదం అనే పదం సంస్కృత పదం 'విద్' (తెలుసుకొనుట) నుంచి పుట్టింది. హిందువుల నమ్మకం ప్రకారం వేదములు సృష్టి కి ముందునుండే ఉండి, కాల క్రమేణా మహర్షులకు వారి ధ్యాన, తపోబలముల వలన ప్రకటించపడ్డాయి.

         ప్రతి వేద మంత్రమునకు ఒక అధిష్టాన దేవత ఉండి, ఆ మంత్రము ఆయనకు అంకితం చేయబడి ఉంటుంది.

         వేదములను వ్యాస మహాముని నాలుగు భాగాలుగా విభజించారు. ఒక నమ్మకం ప్రకారం ప్రతి ద్వాపరయుగాంతం లో ఈ విభజన జరుగుతుంది. ఇప్పటికి ఈ విభజన 27 సార్లు జరిగి ఉండవచ్చని అంచనా.

         మనకి ఉన్న వేదములు నాలుగు. వాటిని గురించి క్లుప్తంగా చర్చిద్దాం....


1. ఋగ్వేదం :


         ఈ వేదం అన్ని వేదాలలోనికి ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఈ వేదం మొట్టమొదటిసారిగా పైల మహర్షికి ప్రకటింప బడింది. అగ్ని దేవుడికి అంకితం చేయబడిన ఈ వేదానికి అధిష్టానదేవత గురువు (Jupiter). ఈ వేదం మొత్తం 10 మండలాలుగా (Books) విభజించబడి, 1028 సూక్తములతో (Hymns) 10,552 మంత్రాలతో అలరారుతూ ఉంది.


         ఈ వేదం మొదటిలో 21 శాఖలుగా విస్తరించి ఉండేది. కాని, ఇప్పుడు 5 శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి. దేవతా సూక్తాలు, ఆత్మ సంబంధిత సూక్తాలు, సామాన్య జీవన విధాన సూక్తాలు ఇందులో పొందు పరచ బడ్డాయి.
         ఇందులోనే 'ఐతిరేయ' మరియు 'కౌషితక' ఉపనిషత్తులు ప్రస్తావించ బడ్డాయి.



2. యజుర్వేదం :


         వైశంపాయన మునికి మొదటి సారిగా ప్రకటించబడ్డ ఈ వేదం వాయు దేవునికి అంకితం చేయబడింది. అధిష్టాన దేవత శుక్రుడు (Venus). ఈ వేదం 40 స్కంధాలుగా (Parts) విభజించబడి, 1975 శ్లోకాలతో అలరారుతుంది.


         ఈ వేదాన్ని 'శుక్ల' యజుర్వేదం అని, 'కృష్ణ' యజుర్వేదం అని రెండు భాగాలుగా విభజించారు. వీటిలో శుక్ల యజుర్వేదం ప్రాచీనమైనది. కృష్ణ యజుర్వేదం యఙ్ఞవల్క్య మునికి ప్రకటించబడినది.


         యజుర్వేదం మొదట 102 శాఖలుగా ( 85 కృష్ణ, 17 శుక్ల) విస్తరించినప్పటికి, ప్రస్తుతానికి 4 కృష్ణ యజుర్వేద శాఖలు, రెండు శుక్ల యజుర్వేద శాఖలు మాత్రమే మనకు మిగిలాయి. ఈ వేదం ముఖ్యం గా సాంప్రదాయ పద్ధతులు, పూజా విధానాలు, బలి మొదలైన వాటిని వివరిస్తుంది.


         కృష్ణ యజుర్వేదంలో 'తైతిరీయ ', 'కథా' ఉపనిషత్తులు ఉండగా శుక్ల యజుర్వేదంలో 'ఈషా', 'బృహదారణ్యక' ఉపనిషత్తులున్నాయి.


3. సామవేదం :


         ఈ వేదం మొట్టమొదటి సారిగా జైమిని మునికి ప్రకటించ బడింది. ఈ వేదానికి అధిష్టాన దేవత అంగారకుడు (Mars). ఈ వేదం ఆదిత్యునికి (Sun) అంకితం చేయబడింది.


         ఈ వేదం రెండుభాగాలుగా విభజించబడింది.
A). పూర్వార్సిక : 4 స్కంధములలో 585 మంత్రములు కలిగి ఉంది.
B). ఉత్తరార్సిక: 21 స్కంధములలో 964 మంత్రములను కలిగి ఉంది.
         మొత్తం 1564 మంత్రాలలో 75 మంత్రాలు ఋగ్వేదం నుంచి గ్రహించ బడ్డాయి.
         మొదటిలో 1000 శాఖలుగా విస్తరించిన ప్రస్తుతానికి మూడు శాఖలు మాత్రమే నిలిచి ఉన్నాయి. దైవ ప్రార్థనలు, సంగీతం, శాంతి ప్రార్థనలు ఈ వేదంలో మనకు కనపడే విశేషాలు.



4. అధర్వ వేదం


         ఈ వేదం మొదటి సారిగా సుమంతు మహామునికి ప్రకటించదడినది. ఆదిత్యునికి అంకితమైన ఈ వేదానికి బుధుడు అధిష్టాన దేవత.


         ఈ వేదం రెండుభాగాలుగా విభజించ బడినది.
A). పూర్వార్ధ: అనేక విషయాలపై చర్చ.
B). ఉత్తరార్ధ: వివిధ ఆచారాలపై కూలంకష చర్చ.
         అధర్వ వేదం నాలుగు భాగాలుగా విభజించబడి 20 స్కంధములతో 6,077 మంత్రములతో అలరారుతున్నది.
         మొదట తొమ్మిది శాఖలలో ఉన్న ఈ వేదంలో ప్రస్తుతం 2 శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి.
         ఈ వేదంలో దైవ ప్రార్థనలతో పాటు సృష్టి పరిణామం గురించిన కథలు, భూతపిశాచ, దుష్ట శక్తులను నివారించటానికి మంత్రాలు, మంత్రవిద్య, తంత్ర విద్య లకు సంబంధించిన విషయాలు కూడా పొందుపరిచారు.
         ఇందులో 93 ఉపనిషత్తులు పొందు పరిచి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 'ప్రశ్న', 'మాండూక',మరియు 'మాండుక్య' ఉపనిషత్తులు.



***        ***        ***
   ప్రతి వేదాన్ని మూడు భాగాలుగా విభజించ వచ్చు.

         1. మంత్ర సంహితలు: ఇహలోక పరలోక లభ్ధికోసం వివిధ దేవతల గురించిన ప్రార్థనలు ఉన్న భాగం.
          2. బ్రాహ్మణములు: వివిధ ఆచారాలు వాటిని పాటించేవిధాలని గురించి వివరించే భాగం.
          3. అరణ్యకాలు: ఆచారాలకు తాత్విక (Philosophical) వివరణ.
          4. ఉపనిషత్తులు: వీటినే వేదాంతాలు అనికూడా అంటారు. ఇవి వేదాలలోని సారాంశాన్ని వివరిస్తాయి.

         మొత్తం వేద విజ్ఞానాన్ని ఒక మహావృక్షంగా భావిస్తే బ్రాహ్మణాలు ఆ చెట్టు పూలుగా, అరణ్యకాలు పచ్చి కాయలుగా, ఉపనిషత్తులని పండ్లుగా వర్ణించ వచ్చు.
          ఊపవేదములు: వేదాల వెలె కాకుండా ఉపవేదములు మహామునులచే లిఖించబడినవి. వీటినే"స్మృతులు" అనికూడా అంటారు. ఇవి వేదాల వలనే మొత్తం నాలుగు.

         1. ఆయుర్వేదం: ఋగ్ వేదానికి సంబంధించిన ఇది ఆరోగ్యాంగా జీవించటానికి పాటించవలసిన విధులని తెలిపే శాస్త్రం.
                 A) చరక సంహిత: మహాముని చరకునిచే రచించబడిన గ్రంథం.
                 B) శుశ్రుత సంహిత: మహాముని శుశ్రుతుని రచన.
                 C) వాగ్భట్ట సంహిత: మహాముని వాగ్భట్టుని రచన.
  
               D) కామ సూత్రములు: మహాముని వాత్సాయనుని రచన.
          2. ధనుర్వేదం: యజుర్వేదానికి సంబంధించిన ఈ ఉపవేదం బ్రహ్మర్షి విశ్వామిత్రునిచే రచించబడినది. ఇది ముఖ్యంగా సైన్య (Military) శాస్త్రానికి సంబంధించినది. మొత్తం నాలుగు భాగాలలో ఈ శాస్త్రం యుద్దానికి సంబంధించిన అన్ని విషయాలని చర్చిస్తుంది. ఇందులోనే వివిధ మారణాయుధాలు, మంత్ర యుద్ధ పద్ధతులు యుద్ధ వ్యూహాల గురించి విపులం గా చర్చించబడింది.

       3. గంధర్వ వేదం: సామవేదానికి సంబంధించిన ఈ ఉపవేదం ముఖ్యంగా కళలకు, సంగీతానికి సంబంధించిన శాస్త్రం. భరత మహాముని రచించిన గంధర్వ శాస్త్రం ఈ కోవలోనికి వస్తుంది.
          4. అర్థశాస్త్రం: రాజకీయ మరియు అర్థశాస్త్రం. ఇందులో నీతిశాస్త్రం, శిల్పశాస్త్రం, అరవైనాలుగు కళలు, ఇంకా అనేక భౌతిక , ప్రాపంచిక విషయాలను కులంకుషంగా చర్చించారు.


వేదాంగములు:


         ఆనవాయతి ప్రకారం వేదాభ్యాసానికి ముందుగా ఈ వేదాంగములని నేర్చుకోవాలి. వేదాంగములు మొత్తం ఆరు.


         1. శిక్ష (Phonetics): పాణిని రచించిన శిక్ష.
         2. వ్యాకరణము (Grammer): పాణిని రచించిన వ్యాకరణము, పతంజలి రచించిన మహాభాష్యము. ఇది పాణిని వ్యాకరణానికి వివరణ.
         3. ఛందస్సు: పింగళాచార్యుల ఛందస్సు.
         4. నిరుక్త (EtymOlogy): యక్షుని నిరుక్త.
         5. జ్యోతీష: ఖగోళ మరియు జాతక శాస్త్రము, గార్గి ముని రచించిన జ్యోతిష గ్రంథము, ఇంకా చాలా గ్రంథములే ఉన్నాయి. భారతీయులు ఖగోళ శాస్త్రంలో వేద కాలంలోనే చాలా ప్రగతి సాధించిన విషయం జగమెరిగిన సత్యం.
         6. కల్ప: ఆచార సంప్రదాయ పద్ధతుల గురించిన శాస్త్రం. ఇందులో మూడు భాగాలున్నాయి.
                I) శుశ్రుత కల్ప: భగవంతునికి ఇచ్చే బలి, నైవేద్య పద్దతులు.
                II) శులభ కల్ప: కొలతలు మొదలైన విషయాలను తెలిపే కల్పము.
                III) ధర్మ కల్ప: నీతి , ధర్మ విషయాలకు సంబంధించినది. ధర్మ కల్పంలో మొత్తం 18 విభాగాలున్నాయి. వాటిలో ప్రముఖమైనవి మూడు.
                         1. మను స్మృతి: ఈ ధర్మసూత్రాలు త్రేతాయుగానికై నిర్దేశించబడినవి.
                         2. యాఙ్ఞవల్క్య స్మృతి: త్రేతా యుగానికై నిర్దేశించబదినది.
                         3. పరాశర స్మృతి: కలియుగానికై నిర్దేశించబడినది.




No comments: