Wednesday, April 10, 2013

ఉగాది - విశేషాలు

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. 

        ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వా గానూ, తమిళులు పుత్తాండుఅనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు. 

        ఉగాది ప్రాముఖ్యం: 

        చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ. 

        "ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'. అంటే సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది' గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు. 

 సంప్రదాయాలు: 

        ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తున్నాయి. ఉగాదిరోజు
1. తైలాభ్యంగనం
2. నూతన సంవత్సరాది స్తోత్రం
3. నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
5. పంచాంగ శ్రవణం
        మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ' తో మొదలుపెట్టి 'అక్షయ' నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. 

        పూజాదులు: 

        అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి క్రొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు. 

        ఉగాది పచ్చడి: 

        "ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తిను పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. 


  ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో"నింబ కుసుమ భక్షణం" మరియు"అశోకకళికా ప్రాశనం" అని వ్యవహరించేవారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
        ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది. 

        ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరిక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం. 


  ఉగాది ప్రసాదం: 

        ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రశాదంలో ముఖ్యంగా పానకం, వడపప్పు చోటు చేసుకుంటాయి. ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది, అలాగే వడపప్పు కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుం కనుక వేసవిలో కలిగే అవస్థలను ఇది కొంత తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ ఋతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది. ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది. ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి, ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది. 

        పంచాంగ శ్రవణం: 

        కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి,వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి ? ఏరువాక ఎలా సాగాలి ? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది. 

        నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్ క్యాలెండరు" ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి "పంచాంగము" ను వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాది విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు. 

 ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం. "పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. 15 తిధులు, 7 వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం".పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.
1. రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.
2. మంత్రి - 
సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.
3. సేనాధిపతి - 
సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
4. సస్యాధిపతి - 
సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
-:వివిధ ఉగాదులు:-

        గుడి పడ్వా: 

        తెలుగువారిలానే చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలు కూడా ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడే వస్తుంది. వారి సంవత్సరాదిని 'గుడి పడ్వా' గా (పడ్వా అంటే పాడ్యమి) వ్యవహరిస్తారు. మన ఉగాదిపచ్చడి లాంటిదే తయారుచేసి దానికి అదనంగా వాము చేర్చి ఆరగిస్తారు. బ్రహ్మదేవుడు ఆ రోజున సృష్టి ఆరంభించినందుకు గుర్తుగా ఆయన పేరున బ్రహ్మధ్వజం నిలుపుతారు. వెదురుపుల్లకు పట్టువస్త్రం కప్పి, పూలతో అలంకరించి పైన వెండి లేదా కంచు పాత్రలు బోర్లిస్తారు. గుడి పడ్వా రోజు ఈ బ్రహ్మధ్వజాలను తప్పనిసరిగా ప్రతిష్ఠిస్తారు. 

        పుత్తాండు: 

        తమిళుల ఉగాదిని (తమిళ) పుత్తాండు అంటారు. ఒకప్పుడు తమిళుల ఉగాది కూడా తెలుగు వారిలానే ఏప్రిల్ లో వచ్చేది. డీ.ఎం.కే. ప్రభుత్వం దీన్ని ఆర్యుల పండుగగా భావించి జనవరిలో జరిగే సంక్రాంతి సమయంలోనే ఉగాదివేడుకలు కూడా జరుపుకోవాలని అసెంబ్లీలో చట్టం చేసింది. ఏప్రిల్ లో వచ్చే ఉగాదిరోజును "చిత్తిరై తిరునాళ్" (చైత్ర తిరునాళ్లు) గా జరుపుకోవాలని ప్రకటించింది. ఆ చట్టం ప్రకారం ప్రస్తుతం తమిళుల ఉగాది వారి పంచాంగం ప్రకారం తై మాసం(జనవరి)లో వస్తుంది. సంప్రదాయబద్ధంగా వచ్చే పుత్తాండు నాడు తమిళులు ప్రత్యేకంగా ఆచరించే విధులేవీ లేవు. ఆరోజున ప్రత్యేక పూజలు చేస్తారు. నవకాయపిండివంటలతో విందుభోజనాలు ఆరగిస్తారు. పంచాంగ శ్రవణం మాత్రం తెలుగువారిలాగానే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు జరుగుతాయి. 

        విషు: 

        మలయాళీల సంవత్సరాదిని 'విషు' గా వ్యవహరిస్తారు. సౌరమానం ప్రకారం చేస్తారు కాబట్టి వీరి ఉగాది ఏప్రిల్ మధ్యలోనే వస్తుంది. పండుగ ముందురోజు రాత్రి ఇంట్లోని మహిళల్లో పెద్దవయస్కురాలు పచ్చిబియ్యం, కొత్తబట్టలు, బంగారు-పసుపు వన్నెలో ఉండే దోసకాయలు, అరటిపళ్లు, తమలపాకులు, అద్దం... వీటన్నిటినీ ఉరళి అనే పాత్రలో పెట్టి పూజగదిలో దేవుడి దగ్గర ఉంచుతారు. వాటన్నిటినీ ఉంచిన పాత్రను విషుకని అంటారు. మర్నాడు ఆమే ముందులేచి వయసుల వారీగా ఇంట్లో అందర్నీ నిద్రలేపి వారి కళ్లు మూసి ఆ పాత్ర దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు కళ్లు తెరవమంటారు. ఆరోజు ఉదయాన్నే లేవగానే మంగళకరమైన 'విషుకని' ని చూస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్మకం. 


    వైశాఖీ: 

        సిక్కుల కాలమానం ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి వారి సంవత్సరాది. సౌరమానం ప్రకారం ఇది ఏటా ఏప్రిల్ 13న, ముపైశ్ఫఆరు సంవత్సరాలకొకసారి ఏప్రిల్ 14న వస్తుంది. తెలుగువారి సంక్రాంతి లాగా ఇది వారికి పంటల పండుగ. రబీ పంట నూర్పిడి సమయం. సిరులు పొంగే ఆ సమయంలో సిక్కుల మనసులు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఉత్సాహంలో స్త్రీపురుషులంతా కలిసి "భాంగ్రా, గిద్దా నృత్యాలు చేస్తారు. కొత్తగా పండిన గోధుమలను పట్టించి ఆ పిండితో రొట్టెలు చేసి బెల్లం, నెయ్యి కలిపి ఆరగిస్తారు. పెద్దపెద్ద మంటలు వేసి వాటిచుట్టూ ఆడిపాడతారు. 

        పొయ్ లా బైశాఖ్: 

        బెంగాలీయుల నూతన సంవత్సరం వైశాఖమాసంతో మొదలవుతుంది. వారి కాలమానం ప్రకారం చైత్రం ఏడాదిలో చివరిమాసం. వైశాఖశుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు వారు. ఆరోజు ఉదయాన్నే స్త్రీపురుషులు సంప్రదాయ బెంగాలీ దుస్తులు ధరించి "ప్రభాత్ ఫేరీ" పేరిట నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇంటిముందు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుతారు. వ్యాపారులు ఆ రోజున పాత ఖాతాపుస్తకాలన్నింటినీ మూసేసి సరికొత్త పుస్తకాలు తెరుస్తారు. తమ దుకాణానికి వచ్చిన వినియోగదారులకు మిఠాయిలు పంచుతారు. ఏవైనా బాకీలుంటే ముందురోజే తీర్చేస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆరోజంతా ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తారు. కొత్తవ్యాపారాలు, కొత్తపనులు ప్రారంభిస్తారు. 

-:విశేషాలు:-

  • ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరము ప్రకారముగా తొలి పండుగ.

  • ఈ పండుగ ప్రతీ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది.

  • ఈ రోజు ప్రతి ఊరిలో దేవాలయాలలో, కూడళ్ళలో, సాంసృతిక సంస్థలలో ఆ సంవత్సరం అంతటా జరిగే మార్పులు, వార ఫలితాలతో పంచాంగ శ్రవణం జరుగుతుంది.

  • ఈ రోజు ప్రతి వారు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం చేస్తారు.

  • ఈ పండుగను యుగాది (యుగ+ఆది) అని కూడా అంటారు.

  • తమిళులు మేష సంక్రాంతి మొదటి రోజు ఉగాది జరుపుకుంటారు.

  • కృతయుగంలో కార్తికశుద్ధ అష్టమి రోజు ఉగాది జరుపుకునేవారు.

  • త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజు ఉగాది జరుకునేవారు.

  • ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజు ఉగాది జరుపుకునే వారు.

  • శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులైంది చైత్ర శుద్ధ పాడ్యమి రోజే.

  • వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజే.

  • కొత్త లెక్కలు ఆరంభించే రోజు ఉగాది.

  • పంచాంగ శ్రవణం చేసేరోజు ఉగాది.



మిత్రులందరికి శ్రీవిజయ నామ సంవత్సర ఉగాది శుభాకంక్షలతో...
(తెలుగు వికీపేడియా నుండి  సేకరణ.)