Sunday, January 8, 2012

గాలిపటం... గాలిపటం

సంక్రాంతి వచ్చేసింది. ఆడవాళ్ళంతా పొద్దున్నే లేచి రాత్రి కష్టపడి ప్రాక్టిసు చేసిన ముగ్గులు వేస్తున్నారు. పిల్లకాయలు తము కొనుక్కున్న గాలి పటాలన్ని లెక్కలుచూసుకుంటున్నారు. ఎవరిదగ్గర ఎంత మాంజా ఉందో, అది సరిపోతుందో లేదో, ఒకవేళ కొత్త మంజా కావాలంటే ఏ షాపు నుంచి తెచ్చుకోవాలో అని ఆలోచనలలో ఉన్నారు. మా ఆవిడ ఇచ్చిన వేడి కాఫీ తాగుతు పేపరు పట్టుకుని మధ్య మధ్యలో వాళ్ళ హడావుడి చూస్తు నేను. ఇల్లంతా పిల్లలతో వాళ్ళ ఫ్రండ్స్ తో కోలాహలంగా ఉంది. వాళ్ళ హడావుడి చూస్తుంటే ఎదో యుద్ధానికి వెళ్ళే సైన్యం లా అనిపించింది.


        "   అవును మరి ఇది ఒకరకమైన యుద్ధమే కదా " అనుకున్నా మనసులో.

        ఒక్కసారి మనసులో నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ రోజుల్లో సంక్రాంతి అంటే ఎంత హడావుడి చేసేవాళ్ళమో. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలావరకు తగ్గిపోయింది అనిపించింది. "ధరలు బాబూ, ధరలు" అనుకున్నా నాకు నేనే నచ్చచెప్పుకున్నట్లు. ఇప్పటివాళ్ళకు ఆనాటి గాలిపటాల పేర్లైనా సరిగా తెలుసో లేదో. పతంగులు అనేవాళ్ళు.

        ఎన్ని రాకాల పేర్లు ఉండేవి? సరిగా గుర్తులేవు. నమందార్, జీబా, లంగోటి, గుడ్లందార్, బనియందార్, గుడ్డి లంగోటి, గిల్లోరాడప్పన్, డోరేదార్, అద్దా, ఇవి కొన్ని గుర్తున్నాయి. హ హ భలే పేర్లు. నామందార్ అన్నా జీబా అన్నా ఒకటే. పతంగి పైన ఒక నామం ఉంటుంది. లంగోటి అంటే పతంగి అడుగున ఒక చిన్న గౌనులాగా, గుడ్లందార్ అంటే రెండు కళ్ళు, బనియందార్ అంటే చారల పతంగి, గుడ్డి లంగోటి అంటే ఒంటికన్ను, కింద గౌను. గిల్లోరాడప్పన్ అంటే సరిగా గుర్తులేదు. దోరేదార్ అంటే పతంగి చుట్టురా కాగితానికి దారం పెట్టేవారు. అద్దా అంటే పెద్ద గాలిపటం.

        సంక్రాంతికి ఒక్కొక్కళ్ళకి పది రూపాయలు ఇచ్చేవారు నాన్న. నేను మా అన్నయ్య ఇద్దరం మా చెల్లెల్లకి మస్కా కొట్టి వాళ్ళ డబ్బులు కూడా స్వాహా చేసేవాళ్ళం. అది వేరే సంగతి అనుకొండి. పతంగుల ధరలు అతిచిన్న పతంగి ఒక పైసా, 3 పైసలకి మధ్యరకం, 5 పైసలకి కొంచం పెద్ద గాలిపటం వచ్చేవి. దోరేదార్ 10 పైసల నుండి మొదలయ్యేవి. అద్దా అటు ఇటుగా 50 పైసలు నుంచి రూపాయి ఉండేది. గీటీ మాంజా 10 పైసలు. గీటి దాదాపు 20 లచ్చాలు. అంటే అంగుష్టాం నుంచి చిటికిన వేలుకి మధ్య దారాన్ని 20 సార్లు చుట్టి ఇచ్చేవాళ్ళు. అప్పట్లో చార్మినార్ దగ్గర గుల్జారాస్ మాంజాలకి చాలా ప్రసిద్ధంగా ఉండేది. ఒక సాదా దారపు రీలు 50 పైసలుండేది. చరఖాలంటివి కొనేవాళ్ళం కాదు. మా ఇంట్లో పాత పాండ్స్ డబ్బాలకి చుట్టు వాడేవాళ్ళం. 

 అస్సలు మా హడావుడి పండగకి వారం ముందు నుంచే మొదలయ్యేది. పాత సీసాలు పోగుచేసి అవి పగలకొట్టి, పొడిచేసి, వస్త్రంపట్టి, అన్నం మెత్తగా వండి, అందులో ఈ సీసాపొడీ కలిపి, రంగుకోసం కాస్త పసుపో, కుంకుమో కలిపి దారాన్ని సందు ఈ మొదలు నుంచి ఆ చివరదాకా కట్టి ఆ అన్నం ముద్దని దారానికి పట్టించి మాంజా చేసేవాళ్ళం. గాజు పొడి దారానికి పట్టుకోవటానికి యూనివర్సిటి వెళ్ళి కలబంద ఆకులు తెచ్చి లోపలి గుజ్జు తీసి అన్నం ముద్దకి కలిపేవాళ్ళం. మాకు అదొక పెద్ద అడ్వెంచర్ లా ఉండేది.


        భోగి మంటకి అందరిళ్ళల్లో ఉన్న పనికిరాని సామాన్లన్ని పోగుచెసేవాళ్ళం. చిత్తు కాగితాలు, ఎండిపోయిన ఆకులు ఒకటేమిటి "కాదేది దహనానికి అనర్హం" అనేలాగా దొరికినవన్ని భోగి నాడు పొద్దున్న తగలడిపోయేవి. మా సందు కూడలిలో భోగి మంట వేసేవాళ్ళం. పొద్దున్నే 5 కే లేచి అందరి ఇళ్ళకి వెళ్ళి మంట వేస్తున్నాం అని చెప్పి లేపి అప్పుడుగానీ మొదలెట్టెవాళ్ళం కాదు. ఒక గంట దాకా అదొక హంగామా.

        అది ఐపోగానే కొనుక్కున్న పతంగులకి కన్నాలు కట్టటం అనే మహాకార్యానికి నాంది పలికే వాళ్ళం. అమ్మో అందులో ఎన్ని రకాలో. కన్నాలు కట్టటం అంటే, సూత్రం కట్టటం అన్నమాట. డీల్ కన్నాలు, కీంచ్ కన్నాలు, బొమ్మ కన్నాలు ఇలా అనేక రకాలుండేవి. డీల్ కన్నాలంటె పతంగి దాలిలో గిరికీలు తిరుగుతూ ఎగురుతుంది. ఎక్కువ గిరికీలు తింటే పట్టుకోవటం కష్టం. చేతులు లాగేస్తాయి. ఒక్కప్పుడు (ఒక్కక్కప్పుడేమిటి చాలా సార్లే) అది అలా తిరుగుతూ వెళ్ళి ఏ చెట్టుకొమ్మల్లోనో ఇరుక్కునేది. కీంచ్ కన్నాలంటే పతంగి దారం లాగినప్పుడు సర్రు మని పైకి లేస్తుంది. పేంచీ వేసేప్పుడు ఈ కన్నాలు చాలా ఉపయోగం. ఈ కన్నాలుంటే పతంగి చాలా బరువు ఉంటుంది. పేంచీ అంటే పతంగుల లడాయి అన్నమాట. ఇంక బొమ్మ కన్నాలంటే పతంగి గాలిలో కదలకుండ బొమ్మలా ఉండిపోతుంది. ఎంత దారం వదిలినా అలా పైకి వెల్తుందే తప్ప అటూ ఇటూ కదలదు. టైంపాస్ కి ఇది బెష్టు. పేంచి టైం లో కూడా చాలా గొప్పభాష ఉండేది. పిలావ్, కాటే, డీల్ చోడో, లప్టావో, కీంచ్ లియా, లూట్ లియా, లాంటివి.

        ఇక సాఫ్ ఐన పతంగులు పట్టుకోవటం కూడా ఒక కళే. ఎన్నో రకాల ఎత్తులు. దొరికివాటిల్లో పెద్ద బొంగు తీసికుని దానికి చివర ఎండిపోయిన కొన్న గట్టిగా కట్టేవాళ్ళం. పతంగి కిందకి వచ్చేలోపలే మనం మన బొంగుతో దాన్ని పట్టెసేవాళ్ళం. కానీ వెంటనే కిందకి దించితే పక్క వెధవలు కుళ్ళుతో చింపేసేవాళ్ళు. అందుకని రెండు నిముషాలు అలానే ఉంచి వాళ్ళు వెళ్ళాక నెమ్మదిగా దించి తీసుకొనేవాళ్ళం. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సాహసాలో సంక్రాంతి పండుగకి. అదొక ఆనందం. ఈ టివీలు, కంప్యూటరులు వచ్చాక ఆ సంబరాలు తగ్గాయనే చెప్పాలి. మళ్ళీ ఆ పాత రోజులు ఎప్పుడొస్తాయో.


        "   ఏమండి మనంకూడా మేడ మీదకి వెళదామా? పిల్లలు పతంగులెగరేస్తున్నారు. చూద్దాం"    అన్న భార్యామణి మాటలతో మళ్ళీ ఈలోకంలోకి వచ్చా.

        "   సరే పదా"   అంటూ మేడ మీదకి దారితీసా పతంగులాడుకోవటానికి, కాదు పిలాయించటానికి.

        ఇంత ఆనందమయ సమయంలో మిత్రులందరికీ

        సంక్రాంతి శుభాకాంక్షలతో...


        మీ మిత్రుడు,  సపరివార సమేతంగా. 

Friday, December 16, 2011

నమ్మండి-నమ్మకపొండి


మన జీవితంలో ఎంతో మందిని కలుస్తుంటాము. ఎన్నో సంఘటనలు తారసపడుతుంటాయి. చాలావరకు సామాన్యమైనవిగానే ఉన్నా కొన్ని సంఘటనలు మర్చిపోలేము. కొన్ని సంఘటనలను నమ్మలేము. మన కళ్ళు మనలని మోసం చేసాయా అనిపిస్తాయి. ఎందుకంటే అటువంటి సంఘటనలు మన దైనందిన జీవితాల్లో కనపడవు. కొన్ని సార్లు మనకి తెలిసినా ఎదో కాకాతాళీయంగా జరిగింది అని వదిలేస్తాము. చాలావరకు సంఘటనలు ఇలాంటివే.

అవి నెను 9 తరగతి చదువుకునే రోజులు. హైదరాబాదులో విద్యానగర్లో ఉండేవారము. ఆరోజు ఆదివారం అవటం వలన నేను మా ఫ్రండ్ ఉదయ్ ఇంట్లోనే ముందు వసారాలు చెస్ ఆడుకుంటూ కూర్చున్నాము. మా అమ్మ వంతింట్లో పూజ చేసుకుంటూ వంటపనిలో ఉంది. ఈలోగా బయట అమ్మా అనే పిలుపు వినిపించింది. ఎవరో ముష్టివాడు అనే ఆలోచనలో మేము పట్టించుకోలేదు. ఆమనిషి ఈలోగా గేత్ తీసుకొని లోపలికి వచ్చాడు. మంచి తెల్లని తెలుపు, పొడుగాటి గడ్డం, కాషాయ బట్టలు వేసుకొని ఉన్నాడు. ఈలోగా మా అమ్మ చాతలో బియ్య తెచ్చింది అతనికి వెయ్యటానికి. ఐతే అతను తీసుకోవటనికి ఒప్పుకోలేదు. ' మీ ఇంట దేవీ పూజ చేస్తారు కాదా ప్రతిరోజూ ' అని అడిగాడు. మాఅమ్మ అవునని తలఊపింది. అతను మా అమ్మ చెయ్యి చాపమని చేతిలో చిటికెడు విభూతి ఇచ్చి ' మీ పూజ గదిలోకి వెళ్ళి చూడ ' మని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడే ఉండి ఈ సంగతంతా చూస్తున్న మాకు ఎంజరుగుతుందో చూద్దామని మా అమ్మ వెనకాలే వెళ్ళాము.

విచిత్రం. పూజ గదిలోకి వెళ్ళగానే మా అమ్మ చేతిలో విభూది కారబ్బంతి పువ్వుగా మారిపోయింది. మా కళ్ళని మేమే నమ్మలేదు. మా అమ్మకైతే అసలేమి అర్థం కాలేదు. ఇలాంతివన్ని కనికట్టు అనుకి ఆ పువ్వు తరవాత మళ్ళి బూడిద ఐపొతుందని బాగా నమ్మి ఆ పువ్వుని ఒక పూజా పుస్తకంలో జాగ్రత్తగా దాచాము. పువ్వు ఎండిపోయింది గానీ మాయం మాత్రం కాలేదు. ఎన్నో ఏళ్ళు అలానే ఆ రేకులు అదే పుస్తకంలో ఉండేవి.

ఇది చదివిన చాలామందికి నేనేదో కథ చెప్తున్నా అనిపించవచ్చు. మరికొంత మంది ట్రాష్ అని కొట్టిపడేయవచ్చు. నాకు ఇలాంటివి నమ్మకం లేకపోయినా కళ్ళతో చూసింది కాదని ఎలా అనటం? ఇది నిజం. మీకెవరికైనా ఏమైనా వివరణ తెలిస్తే చెప్పండి.

Monday, December 12, 2011

కాఫీ దండకం

ఈ కాఫీ దండకం పోకూరి కాశీపతి అనే అవధాన పండితునిచే రచించబడినది. ఒకసారి ఆయన అవధానం కోసం చెన్నపట్టణం చేరుకుని సరాసరి సభాస్థలికి చేరుకున్నారు. సభా ప్రారంభానికి ముందు సభా నిర్వాహకులు ఆయనను కాస్త కాఫీ సేవించవలసిందిగా కోరారు. సగంకప్పుతాగినంతలో సభానిర్వాహకులు ఆయనను సభావేదికనలంకరించవలసిందిగా కోరారు. ఆ సమయంలో అదే సభలో ఉన్న "ఆంధ్రవిశారద" తాపీ ధర్మారావు గారు ఆయనను సేవించిన కాఫీ మీద దండకం చెప్పమని అవధానిగారిని కోరారు. అలా ఉధ్భవించినదే ఈ కాఫీ దండకం.


దండకం


         శ్రీమన్మహాదేవీ, లోకేశ్వరీ, కాళికాసన్నిభాకారిణీ, లోకసంచారిణీ, అంబ కాఫీ జగన్మోహినీ తల్లి శ్రీకృష్ణుడా స్వర్గమున్ జేరివూతంబునౌ పారిజాతంబున్ దెచ్చియున్, నాతికిన్ ప్రీతిగా నిచ్చు కాలంబునందా సుమంబందునం గల్గు బీజంబు లుర్విస్థలిన్ రాలియున్ లోకభేదంబుచే గాఫీ  భూజంబుగా బుట్టియున్, గొమ్మలన్, రెమ్మలన్, బూవులన్, దావులన్, జక్కనౌ పిందెలన్, జిక్కనౌగాయలన్, జొక్కమౌ పండ్ల భాసిల్ల దద్బీజజాలంబు నైర్లండు, నింగ్లండు, హాలెండు, పోలెండు, రష్యా, జపాన్, జర్మనీ, గ్రీకు దేశంబులన్ నాటి పెన్ మ్రాకులై ఇండియన్ దోటలై విత్తనాలిచ్చుచున్నావటంచున్ మదిన్ దోచెనే , బాపురే, తీపిలో, నీరమున్, క్షీరమున్, జెక్కెరన్, మించిటంగాదే నీ బీజ చూర్ణంబు, నా మూటిలో జేర్చి సేవించుటన్ నీదు బీజంబులన్ బెంచులో మాడ్చి చూర్ణమ్ము గావించినన్ దీపిపోదాయె నీ మాధురీ శక్తి, నీ యింపు, నీ సొంపు, నీ పెంపు వర్ణింప నేనెంతవాడన్ ధనాకర్షిణీ, ప్రాణ సంరక్షిణీ, ధాత్రి నెవ్వారలేన్ వేకువన్ లేచియున్ నిత్యకృత్యంబులన్ దీర్చి, మున్ ముందుగా నిన్ను బానంబు గావింపకున్నన్ ద్విజుల్ వేదమంత్రంబులన్ బల్కగాలేరు, ప్రాంచత్కవుల్ పద్యముల్ హృద్యమౌరీతి నిర్మింపగాలేరు, శ్రావ్యంబుగా శౌరిదాసుల్ గళం బెత్తుయున్ బాడి నృత్యంబులన్ సేయగాలేరు, శిల్పుల్ మనస్పూర్తిగా సుత్తి చేపట్టగాలేరు, వైశ్యోత్తముల్ కొట్ల తాళంబులన్ దీయగాలేరు,   డ్రైవర్లు మోటార్ల స్టీరింగులన్ బట్టగాలేరు, టిచర్లు పాఠంబులన్ జెప్పగాలేరు,    డాక్టర్లు నింజక్షనులన్ జేయగాలేరు, ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు, జడ్జీలు నానల్పమౌరీతి తీర్పులన్ వ్రాయగాలేరు, దిట్టంబుగ బాలసుల్ కూట సాక్ష్యంబులం జెప్పగా లేరు, వారాంగనల్ కోడెగాండ్రన్ వెనస్ గేళిలో నోలలాడింపగా లేరు, ముప్పూటలన్ నిన్నొగిన్ గ్రోలకున్నన్ శిరోభారమై నాల్క ఎండున్, మనంబెంతో చాంచల్యముంబొందుచున్ గుండియల తల్లడంబందుచున్, మేను కంపించుగాదే, కటాక్షంబుతో నిత్యమున్ వేకువన్ దర్శనమ్మిచ్చి నిన్ బాగుగం త్రాగు సౌభాగ్యమున్ గూర్చి రక్షింపవే సారెకున్ గొల్చెదన్ విశ్వకర్మాన్యంబందునన్ సత్కవీంద్రుడనన్, పోకూరి కాశీపతి స్వాంత రాజీవ సంవాసినీ నీకికన్ మంగళంబౌ మహా కాఫీ దేవీ నమస్తే నమస్తే నమస్తే నమో నమః 

Tuesday, December 6, 2011

పురాణవైర గ్రంధమాల

 కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన పురాణవైర గ్రంధమాలలో మొత్తం పన్నెండు నవలలున్నాయి. అవి వరుసగా...
1. భగవంతునిమీద పగ2. నాస్తికధూమము3. దూమమరేఖ4. నందోరాజా భవిష్యతి
5. చంద్రగుప్తుని స్వప్నము6. అశ్వమేధము7. అమృతవల్లి8. పులిమ్రుగ్గు
9. నాగసేనుడు10. హెలీనా11. వేదవతి12. నివేదిత

        వీరి ఈ నవలలకు ప్రేరణ ఏమిటో వారి సొంత భాషలోనే తెలుసుకుందాము.

        "అనాదినుండి, అనగా నా చిన్నప్పటినుండి, ఇంగ్లీషువాడు నేర్పెడి వాని చరిత్ర మనచరిత్రలో పాఠ్యగ్రంధములుగా చదివినప్పటినుండి, Hindu Period అను పాఠ్యగ్రంధాలలో చెప్పబడే పరిమితపుటలు గల చరిత్ర చదివినప్పటినుండి, మన పురాణములు పుక్కిటికథలని మొదలైన ఎన్నో అబద్ధములు చరిత్రలో చదివి చదివి నాకు విసుగెట్టినది. తరువాత శ్రీ చిలుకూరు వీరభద్రరావుగారు, మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు, భావరాజు కృష్ణారావు గారు, నేలటూరి వెంకటరమణయ్యగారు, ఈ మొదలైన చరిత్రపరిశోధకులతో నాకు మిక్కిలి దగ్గర తనమేర్పడినది. ఈ చరిత్ర గురించి నేనెంతయో నేర్చుకొంటిని. భారతయుద్ధము రెండువేల యేడ్లక్రింద జరిగినదనీ, రామాయణము కోంచమించు మించుగా జరిగినదని చదువలేక , వినలేక నా బొమికెలు చిట్టెము కట్టెను. ఇట్లుండగా నేబదిఏండ్ల క్రిందనూ, అంతకుముందును, నర్సారావుపేటలో నడింపల్లి జగన్నాధరావుగారని ఒక వకీలు ' మహాభారత యుద్ధకాలము ' అను ఒక చిన్న గ్రంధము వ్రాసినాడు. అందులో సంస్కృత మహాభారతములో భీష్మ నిర్యాణ దినము - మకర సంక్రమణ దినము - విస్పష్టముగా చెప్పబడియున్నది. ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరమును వచ్చును. అచ్చటినుండి లెక్క వేయబడినది.

ఒక పాతికేండ్ల క్రిందవరకు ఫ్రాన్సు దేశపు రాజధానియైన పారీస్ నగరములో నుండెడి గణిత శాస్త్రజ్ఞులు అఖండులు. వాళ్ళు లెక్కలు తేల్చి చూచిరి. విషయము రుజువు చేయబడినది. ఐదేండ్లకొకసారి సంవత్సర పరిమితి కొన్ని సెకండ్లో, ఒకటి రెండు నిముషాలో తగ్గుట ఖండకాల ప్రమాణస్వరూపము. ఒక ముప్పది ఏండ్లక్రిందినాటి ఈ లెక్క ప్రకారము చూడగా భీష్మ నిర్యాణ సమయమున మకరసంక్రమణమెప్పుడయినది?, 1937 సం||న మకర సంక్రమణ మెప్పుడు జరిగినది? ఈ జరిగిన దానికిని దానికిని మధ్య కాలమెంత ఉండినది? ఆకాలమును ఐదైదేండ్లకు కొన్ని కొన్ని సెకండ్లకు తగ్గెడికాలముతో విభజించెడిచో, భీష్మ నిర్యాణము జరిగి, మన పంచాంగములలో వ్రాయబడుచున్న మకర ప్రవేశమునకు, తత్పూర్యము నలుబది ఏండ్లకు పూర్వము మహాభారత యుధము జరిగినదనుటకు సరిపోవుచున్నది. దీనిని పారీస్ లోని మహాగణితశాస్త్రజ్ఞులంగీకరించిరి.



  ఈ విషయమును గురించి తత్పూర్యమే మద్రాసులోని ఒక తమిళ పండితుడు, ప్లీడరు - ఆయనపేరు నారాయణయ్యర్ అనుకొందును - ఆయన ' శంకరుని కాలనిర్ణయ ' మను నొక గ్రంధము వ్రాసెను.

పాశ్చత్య చరిత్రకారులు మన పురాణములందున్న విషయములన్నియు వాళ్ళ ఇష్టమువచ్చినట్లు మార్చివేసిరి. వారి మార్చినదానికి కారణములతో మనకవసరములేదు. ఈ పైన చెప్పిన లెక్కల ప్రకారము మనపురాణములలోనున్న రాజవంశములయొక్క కులములు సరిపోవుచున్నవి. ఇవికాక, మనదేశములోనే' మగధ రాజ వంశావళి '' నేపాళరాజ వంశావళి ' మొదలైన పూర్వ గ్రంధములు కలవు. ఇవికాక కల్హణుని ' రాజతరంగిణి ' కలదు. మనకే చరిత్ర గ్రంధములు చాలాకలవు. విజయవాడలో శ్రీ కోట వెంకటాచలం గారని ఒక మహాపురుషుడు ఈ మహాపరిశోధన అంతయూ జేసి, ఆ నారయణయ్యర్ గారు ఈ జగన్నాధం పంతులుగారు చేసిన పరిశోధనలకు చెట్లు కట్టించి, పూయించి, కాయించి పండించిరి. ఆయన చాలా గొప్ప గ్రంధమ్ములు వ్రాసెను. వానికి ప్రశస్తి ఎందుకు రాలేదనిన మనము బానిస జాతి ఐపోయినాము గనుక.

ఈ మహావిషయాన్ని పురస్కరించుకొని ' పురాణవైర గ్రంధమాల ' అని పండ్రెండు నవలలు వ్రాసాను. నేటి ఆంధ్ర చరిత్రనుబట్టి చూస్తే ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, ఇటువంటి పేర్లు, వాళ్ళు పాలించిన కొద్ది కొద్ది భూభాగాలు, శాసనములు --- ఈ రీతిగా మన యాంధ్ర చరిత్ర ధ్వంసమైపోయింది.

 భారతయుద్ధమైన తరవాత మగధ సామ్రాజ్యమున్నది. జరాసంధుని వంశమున్నది. గిరివ్రజము రాజధానిగా రెండువేల యేండ్లు మహాప్రభువులు భారతదేశమును సామ్రాజ్యముగా పరిపాలించిరి. అందులో ఆరువందల ఏండ్లు, ఆంధ్రులైన శాతవాహనులు గిరివ్రజము నుండి భారతదేశ సామ్రాజ్యమును నేలిరి. ' ద్రావిడభాషలయొక్క తరతమభేద నిరూపక వ్యాకరణ ' మని కార్డ్వెల్ దొర ఒక గ్రంధాన్ని వ్రాసాడు. పాపమా కార్డ్వెల్ శాసించలేదు. పండితులను విచారించమన్నాడు. మనదేశములో అది ప్రమాణగ్రంధమై పోయినది. పరిశోధనలు దానిమీదనే జరుగుచున్నవి. ఇట్టివి ఎన్నియున్నవి? అది వదలివేద్దాము. ఆ కార్డ్వెల్ ఆఫ్ఘన్ స్థానములో బ్రాహూయీ అను ఒక భాష ఉన్నదనీ, ఆ భాషకు మన తెలుగు భాషకు పలువిషయములయందు సామ్యమున్నదని వ్రాసినాడు. శాతవాహనులాంధ్రులు. వారు భారత సామ్రాజ్యమును పాలించినప్పుడు ఆయాప్రాంతములందరు ఆంధ్రులై ఉందురు. ఆనాటి ఆఫ్ఘన్ స్థానములో నెవ్వడో ఆంధ్రుడు అధిపతి ఐ, ఆ ఆటవికులచేత మన భాష చదివించియుండును. దీని లక్షణములు అక్కడ పాతుకు పోయినవి.



 మన చరిత్ర వేరే యున్నది. ఈ మగధరాజ్యము, మౌర్య చంద్రగుప్తుడు, తరవాత గుప్త రాజ్యము, గుప్త చంద్రగుప్తుడు, అలెగ్జాండర్ మనదేశము మీదికి దండెత్తివచ్చినది గుప్త చంద్రగుప్తుని కాలములో. మౌర్య చంద్రగుప్తుని కాలములో కాదు. మౌర్య చంద్రగుప్తునికాలములో నని 1200 ఏండ్లు పాశ్చాత్య చరిత్రకారులు మన చరిత్రను వెనుకకుతోసిరి. అంతదూరము పోనక్కరలేదు. శివాజీగురించి ఎన్ని అబద్ధములు వ్రాసిరి? కలకత్తా బ్లాక్ హోల్ అన్నది జరుగలేదని మనచరిత్ర కారులు రుజువు చేయగా, పాఠ్యగ్రంధముల నుండి తొలగించలేదు.

        మన చరిత్ర విస్పష్టముగానున్నది. మన పురాణములయందలి మగధరాజ వంశాదులయందలి యధార్ధచరిత్ర ననుసంధించి నేను పురాణవైర గ్రంధమాలను పండెండ్రు నవలలను వ్రాసితిని. అందులో ' చంద్రగుప్తుని స్వప్న ' మన్న నవల గుప్త చంద్రగుప్త, మౌర్య చంద్రగుప్తుల భేదమును చెప్పును."

        (ఈ భాగము శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు వ్రాసిన ' నేను - నా సాహిత్య రచనలు ' అనే వ్యాసం యువభారతి వారి ప్రచురణ, ' మహతి ' స్వతంత్ర్య యుగోదయం (1947-1972) లో తెలుగు తీరుతెన్నులు సమీక్ష వ్యాస సంకలనం నుండి గ్రహించబడినది)

Monday, November 21, 2011

కల్యాణ ప్రదమైన కల్యాణి రాగం


కర్నాటక సంగీతంలో ప్రసిద్ధరాగాలలో కల్యాణి రాగం ఒకటి. ఈ రాగం 65వ మేళకర్త ప్రతిమధ్యమ రాగం.సంపూర్ణ రాగం. కటపయాది సూత్ర ప్రకారం 11వ చక్రమైన ఆదిత్య చక్రంలో 5వరాగం, మేచకల్యాణి గా వ్యవహరిస్తారు. శుద్ధమధ్యమ రాగాల్లో శంకరాభరణం ఈ రాగానికి సమానం. అంటే ప్రతిమధ్యం బదులు శుద్ధమధ్యమం వాడితే శంకరాభరణరాగం అవుతుంది. ఈ రాగం హిందుస్థానీ సంగీతంలో యమన్ గా ప్రసిద్ధి చెందింది.
ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు ఈ ప్రకారంగా ఉంటాయి.


సడ్జమము(స), చతుశ్రుతి రిషభము(చ.రి), అంతర గాంధారం(అం.గా), ప్రతి మధ్యమం(ప్ర.మ), పంచమం(ప),చతుశ్రుతి ధైవతం(చ.ధై), కాకలి నిషాదం(కా.ని).


దక్షిణ భారతదేశంలో పెళ్ళిళ్ళు మెదలైన శుభకార్యాలలో ఈ రాగం చాలా తరచుగా వినిపిస్తుంది.  కల్యాణప్రదమైన ఈ రాగంలో అందరు వాగ్గేయకారులు రచనలు చేసారు. వాటిలోకొన్ని:


1. వనాజాక్షీరో - అట తాళ వర్ణం - పల్లవి గోపాల అయ్యార్
2. నిధిచాలా సుఖమా - త్యాగరాజు
3. ఏ తావునరా నిలకడ నీకు -త్యాగరాజు
4. సుందరినీ దివ్య రూపమును చూడ - త్యాగరాజు
5. అమ్మ రావమ్మ తులసమ్మ - త్యాగరాజు
6. వాసుదేవయని వెడలిన - త్యాగరాజు
7. కమలాంబాం భజరే - ముత్తుస్వామి దీక్షితార్
8. హిమాద్రి సుతే పాహిమాం - శ్యామశాస్త్రి


ఇలాంటి ఎన్నో ప్రసిద్ధ రచనలు వాగ్గేయకారులచే చేయబడ్డాయి. 


కర్నాటక సంగీతంలోనే కాక చలన చిత్రసంగీతంలో కూడా ఈ రాగాం చాలా ప్రసిద్ధి కెక్కింది. ఇళయరాజా గారు ఈ రాగంలో ఎన్నో తమిళ పాటలకు సంగీతం కూర్చారు. హింది చలన చిత్రాలలో కూడా ఈ రాగలోని పాటలు అత్యంత ప్రసిద్ధి చందాయి. వాటిలో కొన్ని:


1. మన్ రే, తుకాహె న ధీర్ ధరే - చిత్రలేఖ
2. జిందగీ భర్ నహీ భూలేగి బర్సాత్ కి రాత్ - బర్సాత్ కి రాత్
3. ఆసూ భరీ హై  యే జీవన్ కి రాహే - పర్వరిష్


ఇక తెలుగులో ఈ రాగంలో అత్యంత జనరంజకమైన పాటలు ఉన్నాయి: వాటిలో కొన్ని:


1. మనసున మల్లెల మాలలూగెనే (మల్లీశ్వరి)(ఇక్కడ వినండి)
2. సావిరహే తవదీనా రాధ (విప్రనారాయణ) (ఇక్కడ వినండి)
3. జగమే మారినది మధురముగా ఈ వేళ (దేశద్రోహులు) (ఇక్కడ వినండి)
4. మది శారదా దేవి మందిరమే (జయభేరి) (క్కడ వినండి)
5. తోటలో నారాజు (ఏకవీర) (ఇక్కడ వినండి)
6. సలలిత రాగ సుధా రస సారం (నర్తనశాల) (ఇక్కడ వినండి)
7. ఎప్పటి వలే కాదురా నా స్వామి (అభిమానవంతుడు) 
8. జోరుమీదున్నావు తుమ్మెదా (శివరంజని) (ఇక్కడ వినండి)
9. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ (దేవదాసు) (ఇక్కడ వినండి)
10. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో (సంతానం) (ఇక్కడ వినండి)
11. తొలివలపే పదే పదే పిలిచే (దేవత) 
12. పూచే పూలలోనా (గీత) 
13. రావే నా చెలియా ..చెలియా (మంచిమనసుకు మంచిరోజులు) (ఇక్కడ వినండి)
14. దొరకునా ఇటువంటి సేవ (శంకరాభరణం) (ఇక్కడ వినండి)
15. పూవై విరిసిన పున్నమి వేళ (తిరుపతమ్మ కథ) (ఇక్కడ వినండి)
16. ఎవరివో నీవెవరివో (పునర్జన్మ) ()
17. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా (దళపతి) (ఇక్కడ వినండి)
18. ఏదో తెలియని బంధమిది ఎదలో ఒదిగిన రాగమిదీ (నాయకుడు) (ఇక్కడ వినండి)
19. నా ఊపిరీ నీవేనులే దేవదేవా (పోలీస్ డైరీ) 
20. ఈనాడే ఎదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగనిదీ (ప్రేమ) (ఇక్కడ వినండి)
21. హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి ...(తారకరాముడు) 
22. సుందరి నేనే నువ్వంట (దళపతి) (ఇక్కడ వినండి)
23. రారా నా సామి రారా (విప్రనారాయణ) (ఇక్కడ వినండి)
24. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా (మాతృదేవత) (ఇక్కడ వినండి)
25. పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని (పెళ్ళిచేసి చూడు) (ఇక్కడ వినండి)
26. పాడనా వాణి కళ్యాణి గా (మేఘసందేశం) (ఇక్కడ వినండి)
27. మాణిక్యవీణాం ముఫలాలయంతీం (మహాకవి కాళిదాసు)


ఇలా చెప్పుకొంటూపోతే అంతే ఉండదు. ఈ రాగానికి ఇది చిన్న ఉపోద్ఘాతం మాత్రమే. 
(తప్పులుంటే మన్నించండి)

Sunday, November 20, 2011

భోజరాజు - సాలభంజికలు

         పూర్వం భరత ఖండంలో దక్షిణ మండలాన ధారా నగరాన్ని భోజరాజు పరిపాలిస్తు ఉండేవాడు. అతని రాజ్యం సకల భోగాలతో, పండిత శ్రేష్టులతో, సకల ధర్మాలు తెలిసిన ప్రజలతో నిత్యం కళ కళ లాడుతూ ఉండేది. భోజరాజు కూడా ప్రజల పట్ల పిత్రువాత్సల్యంతో, ధర్మము తప్పక, నీతి న్యాయాలకు పెట్టింది పేరుగా నిష్పక్షపాతం గా పరిపాలించేవాడు. ప్రజలందరికీ ఆ ప్రభువంటే ఎనలేని భక్తి విశ్వాసాలు ఉండేవి.

         ఇలా ప్రజారంజకంగా పరిపాలిస్తున్న భోజరాజుకి అడవి మృగములు గ్రామాలపై పడి పంటలను నాశనం చేస్తున్నవని, వాటి వల్ల ప్రజలు అపాయం కలుగుతున్నదని వార్త తెలిసింది. వెంటనే భోజరాజు తన ప్రధాన మంత్రి బుధిసాగరుడిని పిలచి "మహామంత్రీ ! అడవి మృగాలవలన పంటలు నాశనం అవుతున్నవని, ప్రజలకు అపాయం కలుగుతున్నదన్న విషయం మీకు తెలుసు కదా. తక్షణమే సైన్యం సిద్ధం చేయించండి. నేడే మనము అరణ్యానికి వెళ్ళి ఆ జంతువులని తుద ముట్టిద్దాము" అన్నాడు.

         రాజాఙ్ఞ కాగానే వేటకి సర్వం సిద్ధం అయ్యింది. భోజరాజు సర్వ సైన్య సమేతంగా అడవికి ప్రయాణం అయ్యాడు. అడవికి చేరిన మహారాజు ఎన్నో క్రూరజంతువులని వేటాడాడు. ఎన్నో పులులు, ఎలుగులు భోజ మహారాజు భాణాలకి ఎర అయ్యాయి. అలా అన్ని మృగాలని వేటాడి సర్వ సైన్య సమేతుడై రాజ్యానికి తిరుగు ప్రయాణం అయ్యాడు.

         తిరుగు ప్రయాణం వేళకు మధ్యాహ్నం అయ్యింది. భోజరాజుతో సహా మిగిలిన సైన్యానికి కూడా విపరీతంగా ఆకలి వేయసాగింది. అదే సమయంలో వారికి దారిలో ఒక కోతకు వచ్చిన సజ్జ చేను కనపడింది. దానిని శ్రవణభట్టు అనే బ్రాహ్మణుడు కాపాలా కాస్తున్నాడు. పంట కోతకు రావటంతో పొలము మధ్యలో ఒక పెద్ద మంచె కట్టుకొని వడిసెల తిప్పి పక్షులని బెదర కొడుతున్నాడు.

         అతడు దూరం నుంచి వస్తున్న సైన్యాన్ని, ముందుగా వస్తున్న భోజరాజుని చూసి తన జన్మ ధన్యమైందని అనుకుని మంచ పైనుండే "మహా ప్రభూ ! వందనములు. తమరి రాకతో నా జీవితం ధన్యమయింది. మీరు నా కోరిక మన్నించి ఈ పూట నా ఆతిధ్యం స్వీకరించండి" అన్నాడు.

         అస్సలే ఆకలితో ఉన్న మహారాజుకు మిగిలిన వారికి ఆ మాటలు అమృతం పోసినట్లయింది. వారు సంతోషం గా ఒప్పుకున్నారు. అప్పుడు శ్రవణభట్టు "మహారాజా ! తమరు నా పొలంలో ఉన్న ఆ మహా వృక్షం క్రింద విశ్రాంతి తీసుకోండి. ఆ పక్కనే ఉన్న బావిలోని నీరు కొబ్బరి నీళ్ళలా తియ్యగా ఉంటాయి. కొంచం సేద తీరాక నా పొలంలో ఉన్న సజ్జలు మీకు కావలసినంత తినవచ్చును" అన్నాడు. 



    అందుకు ఒప్పుకున్న మహారాజు సైన్యంతో సహా చెట్టుకింద చేరి మంచినీళ్ళు తాగి కాసేపు విశ్రమించటానికి పూనుకున్నారు.

         ఇంతలో శ్రవవణభట్టు "మహా ప్రభూ ! నా వంటి పేద బ్రాహ్మణుడి కోరికను మన్నించి మీ గొప్పతనాన్ని చాటుకున్నారు. అనులకే కదా మిమ్ములను ప్రజలకి దైవ సమానులయ్యారు. దయచేసి మీరంతా వచ్చి నా పొలములో చక్కగా పండిన సజ్జలను తనివి తీరా ఆరగించండి. ఒక వేళ సజ్జలు ఎవరికైనా ఇష్టం లేకపోతే పక్కనే ఉన్న నా దోస తోటలో మంచి దోస పండ్లు ఉన్నాయి. ఎవరికి ఏది కావలనో అది తినండి " అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన మహారాజు, వారి సైన్యం పొలంలోని సజ్జలు, దోసపండ్లు ఎవరికి కావలసినది వారు కోసుకొని తినటం ప్రారంభించారు.

         ఇంతలో ఏదో పనిమీద మంచె మీదనుంచి దిగిన శ్రవణభట్టు మంచె దిగగానే పొలంలో సజ్జలను దోసపండ్లను తింటున్న సైన్యాన్ని చూసి కోపంతో "ఔరా ఎంత ఘోరం ! పట్టపగలు నేను పొలానికి కాపలా ఉన్న సంగతి కూడా పట్టించుకోకుండా నా పొలం అంతా నాశనం చేస్తున్నారే. ఇది భోజుని రాజ్యం. ఇక్కడ అన్యాయానికి తావు లేదు. ఈ విషయం మహారాజుకు తెలిస్తే మిమ్మలను కఠినంగా శిక్షిస్తారు. నాశనం చేసింది చాలుగానీ ఇంక వెళ్ళండి. లేకపోతే మీ ప్రాణాలు మీకు దక్కవు. " అంటూ అరిచాడు.

         ఆ మాటలు విన్న మహారాజు, సైన్యం ఆశ్చర్యపోయారు. "మహారాజునై నేను ఈ విధంగా ప్రవర్తించటం సరి కాదు" అనుకుని సైన్యం తో తిరిగిపోవటానికి సిద్ధం అయ్యాడు.

         ఈ లోగా మళ్ళీ మంచె మీద చేరిన శరవణభట్టు, వెనుతిరిగి పోతున్న సైన్యాన్ని చూసి "అయ్యలారా ! అప్పుడే మీ కడుపులు నిండాయా? మిమ్ములని చూస్తే మీరు సరిగ్గా తినలేదనిపిస్తోంది. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. దయచేసి అర్ధాకలితో మాత్రం వెళ్ళకండి " అన్నాడు దీనంగా.

         ఇలాగ శ్రవణభట్టు రెండుసార్లు మంచె దిగినప్పుడు ఒక విధంగా మంచె మీద ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తించటం గమనించిన భోజరాజు మహామంత్రి బుధిసాగరుని పిలిచి "మహామంత్రీ ! ఈ బ్రాహ్మణుది ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఈతనికి మతికానీ చలించలేదు కదా! ఇతను మంచె మీద ఉన్నప్పుడు చాలా వినయంగా మంచివాడుగా ప్రవర్తిస్తున్నాడు. మంచె దిగ గానే హటాత్తుగా మారిపోతున్నాడు. ఇది ఆ మంచె ప్రభావమా లేక ఇతనికు మతి లేదా?" అని అడిగాడు.

         అందుకు మహామంత్రి "మహారాజా ! నాకు మాత్రం ఇదేదో మంచెకి సంబంధించినదిగా తోస్తోంది. ఆ మంచె ఉన్న స్థల ప్రభావం వలనే అతను అలా ప్రవర్తిస్తున్నాడు " అన్నాడు.



  సరే ఇదేదో మనమే స్వయంగా తేల్చుకుందాము అనుకున్న మహారాజు శ్రవణభట్టుని పిలిచి"బ్రాహ్మణోత్తమా ! తమరు మామీద జాలి చూపించి మా ఆకలి భాదను తీర్చారు. కానీ మావలన మీ పొలం నాశనం అయ్యింది. అందుకు ప్రతిఫలం గా మీకు ఐదు గ్రామాలు, ఒక చేను ఇస్తాను . దయచేసి ఈ పొలాన్ని మాకు ఇవ్వండి " అన్నాడు.

         ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఆనందంతో "మహాప్రభూ ! తమరు దయతో అంతగా అనుగ్రహిస్తే ఎలా కాదనగలను? తమకు ఏది ఉచితం ఐతే అలాగే చెయ్యండీ " అన్నాడు. ఆ విధంగా ఆ స్థలం మహారాజుకి స్వాధీనమయింది.

         వెంటనే మహారాజు ఆ మంచె ఉన్న స్థలాన్ని తవ్వించటానికి ముహూర్తం పెట్టించి అక్కడ పూజలు జరిపి తవ్వకం మొదలు పెట్టాడు. కొంత సేపటికి అక్కడనుంచి ఒక అద్భుతమైన సింహాసనం బయటపడింది. ఆ సింహాసనం పుర్తిగా బంగారంతో చేయబడి ధగధగా మెరిసిపోతోంది. సింహాసనం మొత్తం వజ్రాలు, పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మీద ఒక సాలభంజిక (ప్రతిమ) ఉన్నది. ఆ సింహాసనాన్ని వర్ణించటానికి మాటలు చాలవు.

         దానిని చూసిన భోజరాజు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆ సింహాసనాన్ని అత్యంత వైభవంతో తన నగరానికి తరలించి దానికి అభిషేకాదులు చేయించాడు. తరవాత బ్రాహ్మణులకు అన్నదాన భూదాన, గోదానములు చేసి, తాను దేవేంద్ర వైభవంతోమిక్కిలు ఉత్సాహంతో ఆ సింహాసనాన్ని ఎక్కటానికి బయలుదేరాడు. అలా బయలుదేరి మొదటిమెట్టు మీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల 32 ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపకా నవ్వాయి.

         ఆ వింతకి అబ్బురపడ్డ భోజరాజు "ఓ ప్రతిమలారా ! మీరెవరు? ఈ సింహాసనం ఎవరిది? మీరలాగు చప్పట్లు కొట్టి ఎందుకునవ్వారు? నేను ఈ సింహాసనానికి తగిన వాడను కానా? " అని ప్రశ్నించాడు.

         అందుకు మొదటి మెట్టులోని ప్రతిమ " మహారాజా! నా పేరు వినోదరంజిత ప్రతిమ. నేను ఈ మొదటిమెట్టుకు అధికారిని. తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హుడని కానా అని ప్రశ్నించారు. అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలెను. పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడి అలంకరించి తన మంత్రి అయిన భట్టి తో సుమారు 2000 సంవత్సరాలు రాజ్యం చేసాడు. అతని గుణగణాలు వర్ణించనలవి కాదు. అతను పరమ సాహసోపేతుడు. అసమాన ధైర్య పరాక్రమాలు కలవాడు. ఆ మహారాజు కాలము తరువాత దీనిని అధిరోహించే అర్హులు ఎవరు లేకపోటం చేతనే ఇది భూమిలోకి క్రుంగింది. విక్రమాదిత్యుని గుణాలలో వెయ్యోవంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హులు. అందుచేత దీనిని, దీనిని అధిరోహించిన విక్రమాదిత్యుని గురించి వివరించటం ఎంతో అవసరం" అన్నది.



       అందుకు భోజరాజు "ఓ వినోదరంజితా, నాకు ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు తెలియచేయండి" అని వేడుకున్నాడు.

         అలా ఒక్కొక్క ప్రతిమా చెప్పిన 32 కథలే ఈనాడు "భట్టి విక్రమార్క" కథలు గా "భేతాళ" కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి.

         ఇంకో విషయం ఏమిటి అంటే 32 సాలభంజికలకు 32 పేర్లు ఉన్నాయి. అవి ఏమిటి అంటే :



1. వినోదరంజిత2. మదనాభిషేక3. కోమలవల్లి4. మంగళ కళ్యాణి
5. మంత్ర మనోరమ6. శృంగార మోహనవల్లి7. ---8. ---
9. ----10. ---11. విద్వత్శిరోమణి12. శాంతగుణవల్లి
13. సూర్యప్రకాశవల్లి14. పూర్ణచంద్రవల్లి15. అమృతసంజీవివల్లి16. కృపాపరిపూర్ణవల్లి
17. కరుణాకరవల్లి18. పరిమళమోహనవల్లి19. సద్గుణవల్లి20. సుందరవినోదవల్లి
21. కనకరంజితవల్లి22. పంకజవల్లి23. అపరాజితవల్లి24. మనోరంజితవల్లి
25. స్వర్ణకాంతవల్లి26. సకలకళావల్లి27. మాణిక్యవల్లి28. మనునీతివల్లి
29. సంప్రదాయవల్లి30. రుక్మిణీవల్లి31. నీతివాక్యవల్లి32. ఙ్ఞానప్రకాశవల్లి

Thursday, November 10, 2011

అనులోమ విలోమ కావ్యం

 శ్రీ రాఘవ యాదవ్యం అనే కావ్యం లో రామ కథ, కృష్ణ కథ ఒకేసారి వస్తాయి. దీనిని అనులోమ విలోమ కావ్యం అంటారు.


         అందులోంచి ఒక పద్యం .... 


వందేహం దేవం తం శ్రీతం
రంతారం కాలం భాసాయః
రామో రామాధీరాప్యాగో
లీలామారాయోధ్య వాసే
                  దీని అర్థం : సీత కొరకు పరితపించుచూ సహ్యాద్రి పర్వతములు దాటి, రావణుని చంపి, సీతతో అయోధ్యలో చాలాకాలము నివసించెనో, ఆ రామునికి నా నమస్సులు . 


         ఇప్పుడు ఇదే పద్యాన్ని తిరగ వేసి రాస్తే: 


సేవాధ్యేయో రామాలాలీ
గోప్యారాధీ మారామోరాః
యసాభాలంకారం తారం
తం శ్రీతం వందేహం దేవం
                  దీని అర్ధం : వక్షస్థలి లక్ష్మీ వాసమై, యజ్ఞ పూజాదులతో స్మరించ యుక్తుడో, రుక్మిణి మున్నగు భార్యలతో సరసమాడునో, గోపికలచే వందించ బడునో, నగలతో విరాజితుడై ఉండునో, అట్టి శ్రీ కృష్ణునకి నా నమస్సులు.